కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) అన్నారు. సోమవారం నారాయణపేట (Narayanpet) జిల్లా, నారాయణపేట మండలంలోని బోయినపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఒక లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, అప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని ఆమె అన్నారు.
రైతన్నలకు సబ్సిడీలు భరిస్తూ రసాయనక ఎరువులు అందిస్తున్న విషయం అందరికీ తెలిసేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలందరూ ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తుందని, ఆ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆమె సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వెంకటేష్ సహకారంతో ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లను ఎంపీ డీకే అరుణ అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి , పగడాకుల శ్రీనివాస్ , లక్ష్మీ కాంత్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల , కౌన్సిలర్ సత్య రఘుపాల్ జిల్లా బీజేప నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

