కలం, వెబ్ డెస్క్: ప్రజలంతా ఖమేనీ (Khamenei)ని అసహ్యించుకుంటారని అనుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. ‘‘బహుశా అవి నకిలీ కన్నీళ్లు (డ్రామా) కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మేము వెనెజువెలాను ఒక్క రోజులోనే ఓడించాం. ఇరాన్ను కోలుకోలేని దెబ్బ తీశాం. వారు సెటిల్మెంట్ కోసం ఎంతో తహతహలాడుతున్నారు. అంత్యక్రియల కోసం మేము వారికి వారం రోజుల పాటు విరామం ఇచ్చాం.. ఎందుకంటే మేము మంచివాళ్లం”అని యాక్సియోస్ అనే వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఖమేనీ అంత్యక్రియల కోసం లక్షలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వీడ్కోలు సమావేశంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఖమేనీకి ఉన్న ఫాలోయింగ్పై సంచలన కామెంట్లు చేశారు. అంత్యక్రియల వేదికపై ఉన్న ఇరాన్ నాయకులందరినీ కేవలం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టగలనని, అయితే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే ఆ పని చేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ముగిసే వరకు ఇరుపక్షాలు చర్చల నుంచి ఒక వారం పాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు ఏ పక్షం కూడా అవతలి పక్షంపై దాడి చేయబోదని ఆయన తెలిపారు.

