కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్లో (Pakistan) ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. ఇస్లామాబాద్లో తన నివాసానికి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు వచ్చి, పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. సీట్ బెల్ట్ కూడా తీసే అవకాశం ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది.
కొంతకాలంగా, పాకిస్థాన్ దేశంలో సైన్యాధికారులను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరుపుతుండటంతో భద్రత లేకుండా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తారిఖ్ సైతం అలాగే వచ్చి హతమైనట్లు తెలుస్తోంది.
తాలిబన్ల పనేనా..?
తారిఖ్ హత్యకు స్పష్టమైన కారణం తెలియరాకపోయినా.. పరిశీలకులు మాత్రం ఆఫ్గనిస్థాన్ హస్తం ఉండొచ్చని చెబుతున్నారు. గతంలో అమాయకులైన ఆఫ్గన్ పౌరులపై తారిఖ్ ఆధ్వర్యంలోని వైమానిక సిబ్బంది బాంబులు వేసి, 400 మంది మరణానికి కారణమైనట్లు ఆరోపణలున్నాయి.
అప్పట్లో తాలిబన్ నేతలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో, టార్గెట్ జాబితాలోకి చేరిన తారిఖ్ను తాలిబన్ ప్రేరేపిత వ్యక్తులే హతమార్చి ఉంటారని చర్చ జరుగుతోంది.

