కలం, వెబ్ డెస్క్: ప్రేమించిన యువతిని కలుసుకోవాలనే ఆరాటంతో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు పాక్ యువకుడు (Pakistani Youth) జీశాన్ మీర్. భారత సైన్యం వెంటనే అలర్టై తిరిగి పాకిస్థాన్కు అప్పగించింది. మే 31న జమ్మూకశ్మీర్లోని ఉరీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ దాటగా, అప్రమత్తమైన భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతడిని విచారించగా, జమ్మూకశ్మీర్కు చెందిన యువతితో స్నాప్చాట్ ద్వారా పరిచయం ఏర్పడిందన్నారు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఆమెను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడాలనే ఉద్దేశంతో వచ్చినట్లు యువకుడు వెల్లడించాడు.
భద్రతా సంస్థలు, పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపారు. యువకుడి నేపథ్యాన్ని పరిశీలించిన తర్వాత అతనికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని గుర్తించారు. కేవలం ప్రేమ వ్యవహారం వల్లే సరిహద్దు దాటాడని నిర్ధారించారు. అనుమానాస్పద అంశాలు లేవని తేలడంతో మానవతా దృక్పథంతో చట్టపరమైన ప్రక్రియలన్నింటినీ పూర్తి చేశారు. పూంచ్ సెక్టార్లోని చాకన్-దా-బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు ఆ యువకుడిని పాకిస్తాన్ సైన్యానికి సురక్షితంగా అప్పగించారు.

