కలం, వెబ్ డెస్క్ : కొబ్బరిబోండం ఊహించని విధంగా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కారు బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య కొబ్బరిబోండం ఇరుక్కుపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (Vijayawada Road Accident) బైపాస్ రోడ్డు సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో తన చిన్న కొడుకు వివాహ వేడుకకు హాజరై తిరిగి కారులో స్వగ్రామమైన రాజమహేంద్రవరానికి బయలు దేరిన దువ్వూరి హరిప్రసాద్(52) అనే పురోహితుడి కారు గొల్లపూడి క్రాస్ రోడ్డు వద్ద అదుపుతప్పింది. దీంతో కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ సమయంలో వెనుక సీటులో ఉన్న కొబ్బరిబోండం ఎగిరిపడి కారు బ్రేక్, క్లచ్ మధ్య ఇరుక్కుపోయింది. అనంతరం కారు వేగంగా కంటైనర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న హరి ప్రసాద్తో పాటు బైక్ వెనుక కూర్చున్న సూరబోయిన గురవయ్య (60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

