కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగంలో దుబాయ్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ విధానం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఉద్యోగుల ఉత్పాదకతను దెబ్బతీయకుండా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రకటించింది. అంటే రోజుకు 8 గంటలు అమల్లోకి తెస్తూ, మూడు రోజులపాటు వీకెండ్స్ ప్రకటించింది. మనదేశంలో (India) కూడా నూతన లేబర్ కోడ్స్ కింద రోజుకు 12 గంటల చొప్పున నాలుగు రోజుల పనిదినాల నిబంధన ఉన్నప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్స్కి మూడు రోజుల వీకెండ్ (Weekend) వస్తే వారు ఏం చేస్తారు? అనే అంశం చర్చకొచ్చింది. మన దేశంలో ‘హస్టిల్ కల్చర్’ (నిరంతరం కష్టపడే తత్వం) ఎంతగా పాతుకుపోయిందో స్పష్టమైంది.
సాధారణంగా దొరికే సెలవు దినాన్ని విశ్రాంతి కోసం కేటాయిస్తారని అనుకుంటాం. కానీ మెజారిటీ భారతీయులు ఆ రోజును కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుంటారని చెప్తున్నారు. 27 ఏళ్ల మీడియా ప్రొఫెషనల్ తాన్యా గార్గ్ మాట్లాడుతూ.. ఆ అదనపు రోజుల్లో తాను కొత్త డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి, నవలలు చదవడానికి వేసుకుంటానని పేర్కొన్నారు. అలాగే మరికొంతమంది అభిరుచులు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటామన్నారు.
ఇంకొందరు ఆదాయ వనరుగా ఉపయోగించుకుంటామన్నారు. ఫ్రీలాన్సింగ్, రైటింగ్, క్లౌడ్ కిచెన్లు, కంటెంట్ క్రియేషన్ లాంటి ఆలోచనలతో ఆదాయాన్ని ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ వెల్లడైంది. భారతీయులకు మూడు రోజుల వీకెండ్ వస్తే కేవలం విశ్రాంతికే పరిమితం కాకుండా, వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగించుకుంటామని స్పష్టమవుతోంది.

