కలం, వెబ్ డెస్క్: స్టింగ్ ఎనర్జీ డ్రింక్స్ (Sting Energy Drink) అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యానికి ఇవి ప్రమాదకరమని భావిస్తూ పాఠశాలల వద్ద వీటి అమ్మకాలను బ్యాన్ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మరాదు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. ఇటీవల పాఠశాలల వద్ద స్టింగ్ డ్రింక్తో పాటు కొన్ని మత్తు పదార్ధాలు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీనిపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి నరహరి జిర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టింగ్ ఎనర్జీ డ్రింక్లో పిల్లలకు అనుకూలం కాని కొన్ని పదార్థాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ఆందోళనలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ పరిసరాల్లో దీనిపై బ్యాన్ విధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్, మత్తు పదార్ధాలతో కలిగే ఆరోగ్య సమస్యలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు స్కూల్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం యాజమాన్యాలకు సూచించింది.
పాఠశాలల దగ్గర స్టింగ్ అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు పిల్లలకు స్టింగ్ ఎనర్జీ డ్రింక్ (Sting Energy Drink) అమ్మడాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ప్రస్తుతానికి స్కూల్స్ పరిధిలో నిషేధాన్ని కొనసాగించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్టింగ్ ఎనర్జీ డ్రింక్లో అత్యధిక మోతాదులో కెఫిన్, షుగర్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇవి ఎదిగే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.
Read Also: యూజర్నేమ్ ఫీచర్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్లకు నోటీసులు
Follow Us On: Instagram

