కలం, నిర్మల్: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండల ఎంపీడీవో రామకృష్ణ (MPDO Ramakrishna) సూచించారు. శుక్రవారం మండలంలోని కడ్తాల్ (Kadthal) గ్రామంలో ఆయన పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైనేజీలు, రహదారులు, తాగునీటి వనరులను పరిశీలించి పరిశుభ్రతకు సంబంధించిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి గ్రామానికి వచ్చిన ఎంపీడీవోను గ్రామ సర్పంచ్ గుర్రం రాము శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమయా తస్కిన్ పాల్గొన్నారు.

