కలం, ఖమ్మం బ్యూరో: వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను మాత్రమే విక్రయించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ స్పష్టం చేశారు. పాల్వంచ (Palvancha) పట్టణంలో ‘మోర్ సూపర్మార్కెట్’లో వస్తువుల నాణ్యతపై ఇటీవల వినియోగదారులు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురువారం సూపర్ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
వస్తువుల నమూనాల సేకరణ..
తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న కొన్ని వస్తువుల నమూనాలను సేకరించారు. పరీక్షల కోసం ల్యాబ్కు పంపించినట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత నిబంధనల మేరకు సూపర్మార్కెట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని, వ్యాపార సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

