కలం, వెబ్ డెస్క్: సెక్రటేరియట్లో మంత్రి సీతక్క నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)ని గురువారం ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు (Tribal MLAs) మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కలిసి పలు అంశాలపైన ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందించారు.
ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు ఇందిర గిరి జల వికాసం పథకం అమలు చేయాలని విన్నవించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ITDA)లను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ పాల్గొన్నారు.

