కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా శిక్షణ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్ కామ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళా (Job Fair) కు విశేష స్పందన లభించింది. గురువారం నిజామాబాద్ జనార్దన్ గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళాకు ఐదు వేల పైచిలుకు మంది యువతీ యువకులు తరలివచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు జాబ్ మేళాను సందర్శించారు.
వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను చేపడుతోందని, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎలాంటి భయాందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్దపేట వేస్తుందన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త పాలసీ రూపొందించనుందని తెలిపారు. నిజామాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున విదేశీ జాబ్ మేళా నిర్వహించడం ప్రశంసనీయమని నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఆయా శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నిరుద్యోగ యువతీ, యువకులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

