కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులకు కల్పించిన పోలీస్ భద్రత ఇప్పుడు రాష్ట్రంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఎలాంటి అధికారిక పదవులు, రాజ్యాంగబద్ధ హోదాలు లేకపోయినప్పటికీ, సీఎం సోదరులైన తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు ప్రభుత్వం భారీగా పోలీసు బందోబస్తును కేటాయించడంపై తమకు కూడా అదే భద్రత కేటాయించాలని పలువురు సామాన్య ప్రజలు కోరుతున్నారు. పాలకుల బంధువులకు ఇచ్చే రక్షణ తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ పలువురు పౌరులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సీఎం సోదరులకు ఏ ప్రాతిపదికన భద్రత కల్పించారో, అదే విధంగా తమకు కూడా పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ 28 మంది సామాన్య ప్రజలు ఎల్బీనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రాణ రక్షణ అనేది ప్రతి ఒక్కరి హక్కని, సీఎం కుటుంబ సభ్యులకు వర్తించే నిబంధనలే తమకూ వర్తింపజేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. సామాన్యుల నుంచి వచ్చిన ఈ వినతిపత్రాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

