కలం, వెబ్డెస్క్: తెలంగాణలో ఓ జర్నలిస్ట్, యూట్యూబర్లను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ ఓ పోస్టు చేశారు. ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించిన కారణంతో ఓ యూట్యూబ్ చానెల్కు చెందిన కేవీఆర్, రావణ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఎక్స్ ఖాతాలను మెన్షన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి , ప్రశ్నించే వాళ్ల గొంతుకలను నొక్కడం పిరికితనమేనని విమర్శించారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా అన్యాయం అన్యాయమేనని, దానికి ప్రజలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని ప్రకాశ్ రాజ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇక పోస్టు చివర తన దైన శైలిలో జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ను కూడా జోడించారు.

