కలం, స్పోర్ట్స్ : టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు (England ODI Series) దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ తొడ కండరాల గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న నితీశ్ ఇంకా రీహాబిలిటేషన్ ప్రారంభించకపోవడంతో జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జూలై 14 నుంచి బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్కు ఆయన అందుబాటులో ఉండే అవకాశాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. బీసీసీఐ (BCCI) వైద్య బృందం నితీశ్కు మరికొంతకాలం పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇదే గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే టీ20 సిరీస్లకు కూడా నితీశ్ (Nitish Kumar Reddy) దూరమయ్యాడు. ఎడమ తొడ ముందు భాగంలోని కండరానికి స్వల్ప గాయం కావడంతో చెన్నైలో అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో వన్డే అనంతరం మైదానానికి దూరంగా ఉన్నారు. నితీశ్ కోలుకునే పరిస్థితిని జట్టు యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో ఆడే అవకాశాలు కనిపించడం లేదని, జింబాబ్వేతో జరిగే టీ20 సిరీస్ ద్వారా తిరిగి పోటీ క్రికెట్లోకి వచ్చే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయాన్ని సెలెక్టర్లు త్వరలో ప్రకటించనున్నారు. ఇక ఇంగ్లండ్ వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు విడతల వారీగా ఇంగ్లండ్కు చేరుకోనున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్కీపర్ కేఎల్ రాహుల్ ముందుగానే చేరి సాధన ప్రారంభించనున్నట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లు జూలై 12 నాటికి జట్టుతో కలవనున్నారు.
ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!
Follow Us On: Instagram

