కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో జూలై నెలకు సంబంధించిన రేషన్ బియ్యం (Ration Rice) పంపిణీకి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 443 రేషన్ దుకాణాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు బుధవారం నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ వరుసగా 15 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 3,26,606 మంది రేషన్ కార్డుదారులకు ప్రతి నెల 6,140 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది. జూలై నెల కోటాకు సంబంధించిన బియ్యాన్ని ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయడంతో పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గతంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ముందస్తుగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. జూన్ నెలతో ఆ కోటా పూర్తికావడంతో, జూలై నెలకు సంబంధించిన సాధారణ రేషన్ పంపిణీని తిరిగి ప్రారంభిస్తున్నారు. రేషన్ కార్డుదారులు తమకు కేటాయించిన ఫెయిర్ ప్రైస్ షాపుల వద్ద బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా 15 రోజుల లోపు తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు.

