కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) సాయంత్రం 4 గంటలకు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత మెరుగుపరచడంతో పాటు అన్ని శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపైనా దిశానిర్దేశం చేయబోతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యమైన మంత్రిత్వ శాఖల పనితీరు, గతంలో సూచించిన లక్ష్యాలను ఏ మేరకు చేరుకున్నారు, ఎలాంటి ఇబ్బందులున్నాయనే అంశాలపై సంపూర్ణంగా విశ్లేషణ చేస్తారని చెబుతున్నాయి. ఈ సమీక్షలో ప్రధాని ముఖ్య కార్యదర్శులు, పీఎంవోలో ఆయా విభాగాలు చూస్తున్న కార్యదర్శులు కూడా పాల్గొనబోతున్నారు.
కేంద్ర మంత్రుల పనితీరుపై ఆరా..?
త్వరలోనే కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని మంత్రిత్వ శాఖలతో సమీక్ష నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. దీనిలో భాగంగా ఆయా కేంద్ర మంత్రుల పనితీరు గురించి కార్యదర్శుల ద్వారా అడిగి తెలుసుకోబోతున్నారా.. అని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు, సహాయక మంత్రుల పనితీరు గురించి పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.

