కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బొగ్గు కొరత (Coal Shortage) తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇదే సమయంలో జెన్ కో యాదాద్రి, కేటీపీఎస్ ప్లాంటుల్లో రెండు యూనిట్లు మూసివేయడం కూడా సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్తు యూనిట్లు మూసివేయడం ఇదే తొలిసారి కావడంతో అసలేం జరుగుతుందనేది చర్చనీయాంశమవుతోంది. సాధారణంగా సింగరేణి వద్ద 26 రోజులకు సరిపడా 25 లక్షల టన్నలు బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే ఉండటంతో జెన్ కోకు సరిపడా బొగ్గు సరఫరా జరగడం లేదు. దీంతో, జెన్ కో తాత్కాలికంగా రెండు యూనిట్లు మూసివేసినట్లు తెలుస్తోంది.
సింగరేణి వాదన మరోలా..
బొగ్గు సరఫరాపై జెన్ కో చేస్తున్న ఆరోపణలను సింగరేణి (Singareni) సంస్థ తిరస్కరించినట్లు సమాచారం. బకాయిలు కొండల్లా పేరుకుపోవడంతోనే తగినంత సరఫరా కావడం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు తీసుకున్నందుకు గాను జెన్ కో ఇప్పటివరకు సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. పలుమార్లు సంప్రదించినా.. జెన్ కో (TG Genco) నుంచి స్పందన లేకపోవడంతోనే బొగ్గు సరఫరా తగ్గినట్లు సమాచారం.
అంతేగాకుండా, జెన్ కో నిర్దేశించిన నాణ్యమైన బొగ్గు ఇటీవల కాలంలో సింగరేణిలో ఉత్పత్తి కావడం లేదని ఇప్పటికే చీఫ్ ఇంజినీర్లు నివేదికలు కూడా పంపారు. బొగ్గు నాణ్యత లోపం కారణంగా తమకు రూ.3 వేల కోట్ల నష్టం వచ్చినట్లు జెన్ కో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో బొగ్గు కొరత (Coal Shortage) తలెత్తినట్లు చెబుతోంది.
Read Also: రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గేమ్.. సీఎం సభకు వ్యూహాత్మక దూరం!
Follow Us On: Instagram

