కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli) మండలం చెరుకుపల్లి గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన రెడ్డిపోగు వెంకటేశ్వరరావు (40) వృత్తిరీత్యా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
చెరుకుపల్లి గ్రామంలో లారీపై జేసీబీ యంత్రాన్ని ఎక్కించి తరలిస్తున్న క్రమంలో, రహదారిపై తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు జేసీబీకి తగిలాయి. ఆ సమయంలో జేసీబీపైనే ఉన్న వెంకటేశ్వరరావుకు హైవోల్టేజ్ కరెంట్ తీవ్రంగా ప్రసహించడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన వెంకటేశ్వరరావుకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు మరణంతో పెంట్లం గ్రామంలోని ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

