కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) నగరంలోని కార్ఖానా గడ్డ సర్వే నంబర్–53లో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (Somidi Venu Prasad) జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్కు అందజేసిన ఫిర్యాదులో, సర్వే నంబర్–53లోని ప్రభుత్వ భూమికి సంబంధించిన ఫోర్జరీ ప్రొసీడింగ్ నంబర్ B1/635/06 ఆధారంగా 11 ఎకరాల 14 గుంటల ప్రభుత్వ భూమిని కల్లేపల్లి బలరాజు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, ఆ భూమిని డాక్యుమెంట్ నంబర్ 5036/2021 ద్వారా కల్లేపల్లి కనకమ్మ నుంచి తనకు గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) రూపంలో వచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూమిలో సుమారు 779 గజాల స్థలాన్ని కూడా విక్రయించినట్లు కార్పొరేటర్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల నుంచి రక్షించేందుకు సంబంధిత అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, భూమిని కాపాడడంతో పాటు అక్రమ లావాదేవీలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

