కలం, హనుమకొండ : అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా చార్టులు, బొమ్మలు, ఆట వస్తువులు (ప్లే ఎక్విప్మెంట్) వినియోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ (Collector Chahat Bajpai) సూచించారు. సోమవారం హనుమకొండ న్యూశాయంపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారుల హాజరు వివరాలను అంగన్వాడీ టీచర్ రమను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ (Chahat Bajpai) వారిని సులభమైన ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుడి పాత్రలో బోర్డుపై ఆంగ్ల అక్షరాలు రాసి వాటిని గుర్తించగలరా అని అడిగి చిన్నారుల పఠన నైపుణ్యాన్ని పరీక్షించారు. బోధనలో ఉపయోగిస్తున్న చార్టులు, విద్యా సామగ్రి, అభ్యాస పట్టికలను పరిశీలించిన కలెక్టర్ వాటి వినియోగంపై అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్నారులకు అందిస్తున్న పోషకాహార భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యతపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల్లో ఆసక్తి పెంపొందించేలా ఆటల ద్వారా బోధన (ప్లే-బేస్డ్ లెర్నింగ్) విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అంగన్వాడీ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి చిన్నారి ఆనందంగా నేర్చుకునే వాతావరణాన్ని కల్పించడంతో పాటు, వారి మానసిక, శారీరక వికాసానికి అనుగుణంగా బోధన సాగాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Also: బీజేపీ అధ్యక్షుడిది బీహార్ మైండ్సెట్.. నితిన్ నబిన్పై చామల ఫైర్!
Follow Us On : WhatsApp

