కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami) పండగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలో రైతులు పాడిపశువులను, ఎడ్లను గ్రామ సమీపంలో ఉన్న వాగులు, చెరువుల వద్దకు తీసుకువెళ్లి వాటిని నీటితో శుభ్రంగా స్నానం చేయించి రంగు రంగుల దారాలు కట్టి రంగులతో అందంగా అలంకరించారు. అనంతరం ఇంటి వద్ద వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు రకరకాల పిండి వంటలు చేసి ఆహారంగా వాటికి ఆప్యాయంగా తినిపించారు. పశువులను రైతులు తమ కుటుంబంలో ఒకరిలా చూసుకుంటామని ఆయా గ్రామ రైతులు పేర్కొన్నారు. సాయంత్రం కాగానే డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్లబండ్లతో దేవాలయాల నుంచి ప్రధానవీదుల మీదుగా బండ్లతో ర్యాలీ నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సుంకులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం..
ఏరువాక పౌర్ణమిని పురష్కరించుకుని గద్వాల పట్టణంలోని శ్రీ సుంకులమ్మ అమ్మవారి ఆలయానికి (Gadwal Sunkulamma Temple) భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, నైవేద్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఏరువాక పండుగ సందర్భంగా సుంకులమ్మ అమ్మవారికి కోళ్లను కోసి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

