కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేట మండలం(Aswaraopeta Mandal) కావాడిగుండ్ల ప్రాంతంలో పులి సంచరిస్తుండటం (Tiger Movement) స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి ఈ పులి ఆదివారం తెలంగాణ పరిధిలోని కావాడిగుండ్ల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు. పులి సంచారం వార్తతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై గ్రామాలలో భద్రతా చర్యలు చేపట్టారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను హెచ్చరిస్తున్నారు.
రైతులు, కూలీలు, స్థానిక ప్రజలు ఎవరూ ఒంటరిగా అడవులలోకి లేదా వ్యవసాయ పొలాలలోకి వెళ్లవద్దని అధికారులు గట్టిగా సూచించారు. అలాగే పశువులను మేత కోసం అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లకుండా సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు గుంపులుగానే ప్రయాణాలు చేయాలని, రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. పులి పాదముద్రలు లేదా సంచారానికి సంబంధించిన సమాచారం కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని, ఎవ్వరూ సొంతంగా చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.

