కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన, క్రమబద్ధమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS Scheme)ను జూలై 15న ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం జరిగిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకంలో భాగంగా భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో, వారిలో ఒకరి వేతనం నుంచి మాత్రమే హెల్త్ కంట్రిబ్యూషన్ను మినహాయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై వారం రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఎంపానెల్డ్ ఆసుపత్రుల జాబితాకు త్వరలో ప్రభుత్వం ఆమెదించనుండగా.. EHCT తదుపరి సమావేశంలో ప్యాకేజీ రేట్లు ఖరారు కానున్నాయి. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సదుపాయం కల్పించనున్నారు. EHCT పర్యవేక్షణలోనే నూతన ఆరోగ్య పథకం అమలు కానుంది.

