కలం, కరీంనగర్ బ్యూరో: కేసీఆర్ హాయంలో ఎన్నడూ డ్యాం నీటిమట్టం టీఎంసీ కంటే తగ్గలేదని.. ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్యాంలో ఆటలు ఆడి డ్రామాలాడారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (SUDA Chairman Komatireddy Narendra Reddy) మండిపడ్డారు. ఉదయం గంగుల డ్యాంకు వెళ్లి ఆటలాడుతే సాయంత్రం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులు నాయకులు కార్యకర్తలతో వెళ్లి నీటిని పరిశీలించి మాట్లాడారు. “బీఆర్ఎస్ హాయంలో ఇదే సీజన్ లో 15 టీఎంసీల కంటే ఎన్నడూ తగ్గలేదన్నావ్ గదా ఇదిగో అధికారిక ఆధారాలు చూపిస్తన్నా.. దమ్ముంటే నా సవాల్ను స్వీకరించు.. నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్” అని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను 2 టీఎంసీల నీళ్లు రాబోయే నెలల వరకు కరీంనగర్ నగర ప్రజల త్రాగు నీటికి మిషన్ భగీరథకు సరిపోతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ఈలోగా వర్షాలు కురుస్తాయని ఒకవేళ ఇంకా ఇబ్బందయితే మిడ్ మానేరులో 4 టీఎంసీలు అదనంగా ఉన్నాయని పేర్కొన్నారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది చాలక కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేస్తే నీళ్లు వచ్చేవని మాట్లాడుతున్నారని.. అదేమన్నా ప్యాచ్ వేస్తే ఆగేదా అని ఎద్దేవా చేశారు.
ఇటువంటి డ్రామాలు, అబద్ధాలు ఆపకపోతే “మీరు డ్యాంలో ఫుట్ బాల్ ఆడిండ్రు గదా.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే మిమ్ములను ఫుట్ బాల్ ఆడుతారు” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పోరేటర్ పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, లయాక్, చర్ల పద్మ, నెల్లి నరేష్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, అస్థాపురం తిరుమల, మహాలక్ష్మి, కంది అశోక్ రెడ్డి, బషీర్, షెహన్షా, మాసుం ఖాన్, రాజ్ కుమార్, హనీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

