కలం, వెబ్ డెస్క్ : దేశంలోనే ఫుడ్ డెస్టినేషన్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మహా నగరం ఆహార పరిశుభ్రత (Hyderabad Food Hygiene) విషయంలో మాత్రం దారుణంగా విఫలమైంది. తాజాగా భారత భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్ల పరంగా హైదరాబాద్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది.
హైదరాబాద్ లో ఉన్న హోటల్లు, రెస్టారెంట్లలో చాలా తక్కువ సంస్థలే ఫుడ్ హైజీన్ (Hyderabad Food Hygiene) సర్టిఫికేషన్ పొందాయని భారత భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) తేల్చింది. హైదరాబాద్ లో దాదాపు 75,000 ఆహార వ్యాపార సంస్థలు ఉండగా.. వాటిలో కేవలం 25 వేల సంస్థలకు మాత్రమే అధికారిక లైసెన్స్లు ఉన్నాయని చెప్పింది. వీడిలోనూ ఫుడ్ హైజీన్ రేటింగ్ పొందినవి కేవలం 361 సంస్థలేనని.. ఇది మొత్తం లైసెన్స్ పొందిన సంస్థలో రెండు శాతం కన్న తక్కువ అని వెల్లడించింది.
కాగా, ఆహార పదార్థాల తయారీ, నిల్వ, వడ్డింపు, పరిశుభ్రత వంటి అంశాలను అంచనా వేసేందుకు FSSAI ప్రత్యేకంగా హైజీన్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆహార పదార్థాల నిర్వహణ విధానం, వంట గది పరిశుభ్రత, ఆహార నిల్వ ప్రమాణాలు, ఉద్యోగుల వ్యక్తిగత పరిశుభ్రత వంటి ప్రమాణాలను పరిశీలించే హైజీన్ రేటింగ్ విధానంలో హైదారాబాద్ నగరం వెనకబడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలోని హోటళ్లల్లో ప్రజల ఆరోగ్యానికి అన్యాయం జరుగుతుందని ఈ రిపోర్ట్ వెల్లడిస్తోంది.
మరోవైపు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్ల పరంగా 3,394 భోజనశాలల లైసెన్స్లు కలిగిన ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ఆహార రంగంలో హైదరాబాద్ కు అత్యంత సమీపంగా ఉండే బెంగళూరులో కూడా పరిశుభ్రత రేటింగ్లు కలిగిన 2,200 భోజనశాలలు ఉన్నాయి. అయితే బిర్యానీ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు ప్రత్యేక ఆహార సంస్కృతి కలిగిన హైదరాబాద్ నగరం ఫుడ్ హైజీన్ ప్రమాణాల్లో చిట్ట చివరి స్థానంలో నిలవడం నగర ప్రతిష్ఠకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర వినియోగదారులు ఆహారం తీసుకునే ముందు సంబంధిత రెస్టారెంట్కు FSSAI లైసెన్స్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: అమ్రాబాద్ ఫారెస్ట్లో ఎన్ని పులులు ఉన్నాయంటే?
Follow Us On: Instagram

