కలం, వెబ్ డెస్క్ : జార్జియా దేశ పార్లమెంట్ (Georgian Parliament) వేదికగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వసంతకాల సమావేశాల ముగింపు సందర్భంగా జరిగిన తుది ప్లీనరీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా సహనం కోల్పోయి పిడిగుద్దులు కురిపించుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రధాని ఇరాక్లీ కొబఖిడ్జే తన వార్షిక ప్రభుత్వ నివేదికను సభ ముందు ఉంచి ప్రసంగించిన అనంతరం ఈ గొడవ మొదలైంది. ప్రధాని ప్రసంగం ముగిశాక ప్రారంభమైన ప్రశ్నోత్తరాల సమయంలో అధికార ‘జార్జియన్ డ్రీమ్’, ప్రతిపక్ష ‘ఫర్ జార్జియా’ పార్టీలకు చెందిన నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నేతలు పరస్పరం సహనం కోల్పోయి, ఒకరి షర్ట్లు మరొకరు పట్టుకుని దాడులకు దిగారు.
ఈ ఊహించని పరిణామంతో పార్లమెంట్ నడవడికకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభలో గొడవ పెద్దది కావడంతో వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ పర్సనల్) ఇరువర్గాలను శాంతింపజేసి, సభలో తిరిగి సాధారణ పరిస్థితులను కల్పించారు.

