కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగు నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలసి ఆదివారం మహా ధర్నా చేపడతామని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ రైతులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులుతో ఆయన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలించాలని కోరారు.
వరద కాలువ పైన ఉన్న ఆచంపల్లి తూము ద్వారా కొత్తపల్లి మండలంలోని ఏడు గ్రామాలు నాగుల మల్యాల, బావుపేట, కమాన్ పూర్, కొండాపూర్, ఎలగందల్, శ్రీరాముల పల్లె రైతులకు సాగు నీటిని విడుదల చేసి.. చెరువులు నింపాలని గత వారం రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించామని చెప్పారు. ఐనా ఇప్పటివరకు ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి స్పందించకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు.. ఇక పోరాటం తప్పదని భావించి నీటిని సాధించేందుకు రైతులతో కలసి మహా ధర్నా చేపడుతున్నామన్నారు.
ఈ ధర్నాకు రైతులందరూ స్వచ్ఛందగా తరలి రావాలని గంగుల పిలుపునిచ్చారు. తెలంగాణ నుండి రాజమండ్రికి నీటిని తరలింపుపైన ఉన్న శ్రద్ధ.. తెలంగాణ ప్రజలు నీటికి గోస పడుతున్న వారిపై లేదన్నారు. రైతులను పట్టించుకునే వారే కరువైయ్యారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో చెరువులను, మత్తడులను దుంకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

