కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. రామాయపట్నం పోర్టును స్వాహా చేయడానికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. పోర్టు నిర్మాణాలు అన్నీ వేగంగా పూర్తి అవుతున్నాయంటూ చంద్రబాబు చెబుతున్న మాట పచ్చి అబద్ధమని మండిపడ్డారు. వీటిని అడ్డం పెట్టుకుని దోచుకోవాలనే ఆలోచనే పోర్టుల ప్రైవేటీకరణకు కారణమని చెప్పారు. తమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇన్ని పోర్టుల నిర్మాణం చేశారనే పేరు రాకూడదనే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పోర్టును ప్రైవేటుపరం చేయొద్దు..
రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎందుకు వీటిని మత్స్యకారులకు అందుబాటులోకి తేవడం లేదని ప్రశ్నించారు. స్థానిక మత్స్య సంపదను తమిళనాడు బోట్ల వారు దొంగిలిస్తుంటే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి మత్స్యకారులు పట్టుకున్న బోట్లను కూడా వదిలేశారని అన్నారు. రామాయపట్నం పోర్టును డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్సఫర్ (DBFOT) విధానం కింద ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్నిరాష్ట్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాడ్ చేశారు. ఈ మేరకు నెల్లూరులోని పార్టీ కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతాం..
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమీకరిస్తూ 2024 ఫిబ్రవరిలోనే గత వైసీపీప్రభుత్వం జీవో No.6ని విడుదల చేసినట్టు వివరించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 4,929 కోట్లు అసవరం కాగా, అందులో రూ. 3928 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమీకరించుకునేలా వెసులుబాటు కల్పించామని వివరించారు. కూటమి ప్రభుత్వం కేవలం రూ. 991 కోట్లు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుందని.. ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేకపోతుందా? అని ప్రశ్నించారు. పోర్టును ప్రైవేటీకరణ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేశారా? అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోకపోతే మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజల తరఫున వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతోందని హెచ్చరించారు.

