కలం, సూర్యాపేట : ప్రైవేటు విద్యాసంస్థలను సంఘాల పేరుతో ఇబ్బందులు, బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ (Suryapet DSP Prasanna Kumar) తెలిపారు. గురువారం రోజున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి పాఠశాలలోకి కొంత మంది వ్యక్తులు విద్యార్థి సంఘాల పేరుతో విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన విషయమై యాజమాన్యం ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘విద్యార్థి సంఘాల పేరుతో విద్యార్థులకు అసౌకర్యం కలిగించ వద్దు. విద్యాసంస్థల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయవద్దు’ అని ఈ సందర్భంగా వివిధ రకాల సంఘాలకు డీఎస్పీ (Suryapet DSP) సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం, విద్యార్థులను రవాణా చేసే బస్సులను అడ్డుకోవడం, యాజమాన్యాలను లేదా ఉపాధ్యాయులను బెదిరించడం, పెద్ద శబ్దాలతో నినాదాలు చేస్తూ విద్యార్థులు భయపడేలా వాతావరణం సృష్టించడం, చందాల రూపంలో డబ్బు వసూల్లు చేయడం వంటి చర్యలకు పాల్పడడం చట్ట విరుద్ధం అని ఆయన హెచ్చరించారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏమైనా సమస్యలు ఉంటే, వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, సమస్యలపై అధికారులు నిబంధనల ప్రకారం విచారణ, దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతే కానీ విద్యార్థి సంఘాల పేరు చెప్పుకుని పాఠశాలల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించ వద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

