కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును (Ramakrishna Rao) సీఎంకు సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెలాఖరున రిటైర్మెంట్ కాబోతున్న నేపథ్యంలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. రిటైర్మెంట్ అయ్యాక ఎక్స్ అఫిషియోగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రామకృష్ణారావు ముఖ్యమంత్రికి సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది. వేతనం, సౌకర్యాలు, ఇతర అంశాలను మరో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.
అప్పుడు, ఇప్పుడు కీలక బాధ్యతల్లోనే..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే వరకు రామకృష్ణారావు ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తూ వచ్చారు. ఒక రాష్ట్రానికి అత్యధిక బడ్జెట్లు రూపకల్పన చేసిన ఐఏఎస్ అధికారిగా కూడా రికార్డు నెలకొల్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన రామకృష్ణారావును రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. పలుమార్లు కేంద్రంతో సంప్రదించి సీఎస్ పదవి పొడగించేలా చేశారు. ఇప్పుడు రిటైర్మెంట్ అవబోతున్న నేపథ్యంలో.. సీఎంకు సలహాదారుడిగా నియమితులు కావడం గమనార్హం.

