కలం, వెబ్ డెస్క్: ప్రజలు కోరిన కోరికలు తీరాలని భక్తి శ్రద్ధలతో, మత సామరస్యంతో జరుపుకునే రొట్టెల పండుగ (Rottela Panduga) నేడు ప్రారంభమై ఐదు రోజుల పాటు జరుగనుంది. నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువు వద్ద ఈ వేడుక జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే వేడుకలకు జనం లక్షలాది సంఖ్యలో తరలివస్తారు. చెరువు వద్ద రొట్టెలు మార్చుకొని తమ కోరికలు చెప్పుకొని ప్రార్థిస్తారు. పెళ్లి, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, ఇలా ఎన్నో కోరికలు కోరుకుంటూ వాళ్లు పంచుకునే రొట్టెలకు ఆ పేర్లు పెట్టుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన మరుసటి సంవత్సరం అవే పేర్లతో రొట్టెలను వేరే వాళ్లకు అందిస్తారు.
ఏళ్ల తరబడి వస్తున్న ఈ ఆచారంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ వంటి బేధాలు లేకుండా అన్ని మతాల వాళ్లు పాల్గొంంటారు. ఏపీ నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఈ వేడుకలకు హాజరు కావడం విశేషం. మొదటి రోజు దర్గా వద్ద సంధల్ మాల్ అనే కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. బారా షాహితులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజు రాత్రి గంధ మహోత్సవం నిర్వహిస్తారు.
మూడో రోజు ప్రధాన ఘట్టమైన రొట్టెల పండుగ నిర్వహిస్తారు. ఆరోజే అందరూ స్వర్ణాల చెరువులో దిగి తమ రొట్టెలు మార్చుకుంటారు. నాలుగో రోజు తహలీల్ ఫాతేహీ పేరుతో ప్రత్యేక ప్రార్థలు నిర్వహించి, ఐదో రోజు ముగింపు వేడుకలు చేస్తారు. ఇలా జూన్ 30 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

