కలం, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కొత్తగూడెం (Kothagudem) సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుండి ప్రకాశం స్టేడియం వరకు జనసంద్రంలా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు భారీగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం సామాజిక రుగ్మతని, జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు, సినిమాల్లోని చెడుకు దూరంగా ఉంటూ క్రీడలు, కళలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ఆయన సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచార గోప్యత, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వంటి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మందికి పైగా విద్యార్థులు డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయగా.. కమాండెంట్ పి.సి.వి.రమణ, డీఎస్పీ ఆదినారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

