కలం, వెబ్ డెస్క్: ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) గురువారం విసృత పర్యటన చేశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు నాణ్యంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలలో పరిశుభ్రత, భోజన నాణ్యత, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది కరకట్ట భద్రత కోసం నూతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్న జియో ట్యూబ్స్ పనులను పరిశీలించారు. గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను పర్యవేక్షించారు. సంబంధిత అధికారులను అడిగి మ్యాప్ ఆధారంగా గోదావరి నది ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే మంగపేట మండల కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆఫీస్ భవనాల నిధుల కింద రూ.150 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

