కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్లోని 50వ డివిజన్ జ్యోతినగర్ కాలనీ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోయాయి. గత మూడు రోజులుగా 5 ట్రాక్టర్ల చెత్తాచెదారం తొలగించడం గమనార్హం. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీలు బ్లాక్ అయి, వర్షాలు కురిసినప్పుడు మురుగు నీరు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెత్త , వ్యర్ధాల వల్ల దోమలు పెరిగి రోగాలు వచ్చే అవకాశాలున్నాయని వాపోతున్నారు. ఈ ఒక్క ప్రాంతంలో ఇలా ఉంటే నగరంలోని 60 డివిజన్లలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. పారిశుద్ద్య కార్మికులు నిత్యం డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలోనే ఉన్నారు. డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం మానుకోవాలని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

