కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఎల్ఐజీ ఇండ్ల స్కీమ్ (Telangana Housing Scheme)కు ఉత్తమమైన పేరును ఎంపిక చేసేందుకు స్టేట్ హౌజింగ్ బోర్డు ఆలోచిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గృహవసతి కల్పించే స్కీమ్కు ‘ఇందిరమ్మ ఇండ్లు’ అని పేరు పెట్టింది. అర్బన్ ప్రాంతంలో అమలుచేసే స్కీమ్కు మంచి పేరు పెట్టే అవకాశాన్ని ప్రజలకే కల్పించింది.
హైదరాబాద్లో అల్పాదాయ వర్గాలకు లక్ష ఇండ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి, గృహనిర్మాణ మంత్రి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రెడీ అవుతున్నది. ఈ స్కీమ్కు మంచి పేరు పెట్టాలనే ఉద్దేశంతో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఉత్తమమైన పేరు సూచించినవారికి లక్ష రూపాయల బహుమతి అందిస్తామని హౌజింగ్ బోర్డు ప్రకటించింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ అల్పాదాయ వర్గాల కుటుంబాలకు ఎల్ఐజీ ఇండ్లను ‘క్యూర్’ పరిధిలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లక్ష ఫ్లాట్లను నిర్మించే ఈ భారీ గృహ నిర్మాణ పథకానికి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల్లో ఒకదాన్ని ఎంపిక చేసి దాన్ని సూచించినవారికి లక్ష రూపాయలను ఇవ్వనున్నది. ఈ నెల 28వ తేదీ వరకు సోషల్ మీడియా వేదికగా ఈ అవకాశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. హౌజింగ్ శాఖ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘tghd.official’ ద్వారా ప్రజలు వారి సూచనలను పంపవచ్చని పేర్కొన్నది.

