కలం, స్పోర్ట్స్ : మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) 2026లో ఒక ప్రత్యేక కార్యక్రమానికి వేదిక సిద్ధమైంది. జూన్ 24న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్ను యూనిసెఫ్ కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), యూనిసెఫ్ యూకే, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కలిసి నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల కోసం యూనిసెఫ్ చేపడుతున్న కార్యక్రమాలకు నిధులు సమీకరించడం, ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా లక్ష పౌండ్ల నిధులు సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రత్యేక మ్యాచ్డేలో యూనిసెఫ్ యూకే మద్దతుదారుడు, ప్రముఖ నటుడు నభాన్ రిజ్వాన్ కూడా పాల్గొననున్నారు. క్రికెట్ అభిమాని అయిన ఆయన, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఈసా గుహాతో కలిసి ట్రోఫీని మైదానంలోకి తీసుకురానున్నారు. ఈ మ్యాచ్ కోసం లార్డ్స్ మైదానం మొత్తం యూనిసెఫ్ సందేశాలతో అలంకరించబడనుంది. జాతీయ గీతాల కార్యక్రమంలో యూనిసెఫ్ జెండాను ప్రదర్శించనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్ను వీక్షించే ప్రేక్షకులకు విరాళాల కోసం ప్రత్యేక సందేశాలు అందించనున్నారు.
నభాన్ రిజ్వాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో యూనిసెఫ్ చేపడుతున్న చిన్నారుల సంక్షేమ కార్యక్రమాలకు అభిమానులు కూడా విరాళాలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ (Women T20 World Cup) వేదికగా జరగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా క్రికెట్తో పాటు సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్
Follow Us On: Instagram

