కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వార్షిక తనిఖీలలో భాగంగా మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ (Rajapur Police Station)ను జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ నిర్వహణను, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న క్రైమ్ వివరాలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నేరాల నియంత్రణలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి వ్యక్తికి పోలీసులపై నమ్మకం పెరిగేలా సేవలు అందించాలని సూచించారు.
స్టేషన్ పరిసర ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ జానకి ప్రత్యేకంగా సమావేశమై వారి శాఖాపరమైన అవసరాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్/ఎస్హెచ్వో) స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సిబ్బందితో సమన్వయం పెంచుకొని సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి NH-44 ఉండటంతో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్, రాజాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

