కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు (Sai Krishna Missing Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన సీఐ నాగరాజు (CI Nagaraju)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న సీఐ నాగరాజు ఇంటి వద్ద ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజును ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చన్న వార్తలతో ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫ్లెక్సీలు పట్టుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు, సిట్ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నాగరాజును అరెస్ట్ చేయొద్దని, నిజాయితీ గల ఆఫీసర్లు తమకు కావాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టి ఇంట్లోకి వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. సిట్ బృందం ఆయనను స్టేట్ పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించి విచారించనుంది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ ఫుటేజ్ను భద్రపర్చాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ విచారణలో మే 1 నుంచి దాదాపు నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ మాయమైనట్లు తేలింది. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారని సిట్ అధికారులు భావిస్తున్నారు.

