కలం, వెబ్ డెస్క్: తాము చదువుకున్న కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విద్యార్థినులపై ఓ సీఐ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఐ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లలతో అలా దౌర్జన్యంగా ప్రవర్తించడం ఏమిటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal)లోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థినులు తమ ఇంటర్ సర్టిఫికెట్ల కోసం ఆందోళన చేపట్టారు. కాలేజీ పూర్తయినా యాజమాన్యం తమ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తోందని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. ఆదిభట్ల సీఐ (Adibatla CI) రవి కుమార్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడున్న వారందరినీ పక్కకు నెట్టివేశాడు. ఈ క్రమంలో ఆడపిల్లలు అని కూడా చూడకుండా విద్యార్థినులను బలంగా తోసేశాడు. విద్యార్థులను కొడుతూనే పక్కకు నెట్టివేశాడు. పక్కనే ఉన్న వారు ఆడపిల్లలపై చేయి చేసుకోవద్దని చెప్పినా వినిపించుకోలేదు. సీఐ తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులపై చూపించే దౌర్జన్యం, విద్యార్థులను వేధించే విద్యా సంస్థలపై చూపించరా? అని ప్రశ్నిస్తున్నారు.

