కలం, హనుమకొండ: ఎస్ఐఆర్ (SIR) పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, ఒకప్పుడు ఓటును జోడించే కార్యక్రమాలు జరిగితే ప్రస్తుతం ఓటును తొలగించే కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. బెంగాల్లో ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ (BJP) అడ్డదారిలో గెలిచిందని ఆరోపిస్తూ, ఓట్లే కాకుండా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటును కూడా దొంగిలించారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తమ సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్పై కూడా మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారని ప్రశ్నిస్తూ, గత పదేళ్లలో జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలను మర్చిపోయారా అని విమర్శించారు. ఆస్తుల కోసం చెల్లిని గెంటివేసిన వ్యక్తి ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు విషయంలో బీఆర్ఎస్ వ్యవహారం బీజేపీకి బలం చేకూర్చేలా ఉందని ఆరోపించారు.

