కలం, మెదక్ బ్యూరో: యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న “నషా ముక్త్ భారత్ సప్తాహ్” అవగాహన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. డ్రగ్స్ వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజానికే తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు జూన్ 17 నుంచి జూన్ 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న “నషా ముక్త్ భారత్ సప్తాహ్ – 2026” ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. యువతను వ్యసనాలకు దూరంగా ఉంచడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి సకాలంలో సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 14446 నేషనల్ డీ-అడిక్షన్ హెల్ప్లైన్ సేవలను అందుబాటులో ఉంచిందన్నారు. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

