కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఆ గ్రామ రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఒకే రకమైన ధాన్యాన్ని పండించామని, అధికారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి గోదాములకు తరలించారని తెలిపారు. అయితే అదే ధాన్యాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్గా వర్గీకరించి రైతులకు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించారని ఆరోపించారు.
దీంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కొందరు రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన డబ్బులు జమ కాలేదని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

