కలం, కరీంనగర్ బ్యూరో: కన్న తండ్రి, కట్టుకున్న భార్య ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేసి ఎవ్వరికి అనుమానం రాకుండా ప్రమాదంగా చిత్రీకరించారు. కరీంనగర్(Karimnagar) పోలీసుల లోతైన విచారణలో అనుమానాస్పద మృతి కేసు హత్య కేసుగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య (36) అనుమానాస్పద స్థితిలో ఈ నెల 2వ తేదీన మృతి చెందాడు. మృతుడు అంజయ్య 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అదే సమయంలో అంజయ్య తండ్రి లచ్చయ్య తన కోడలు శిరీషతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 2019లో తిరిగి వచ్చిన అంజయ్యకు తండ్రి, భార్య మధ్య ఉన్న అక్రమ సంబంధం విషయం తెలియడంతో పలుమార్లు మందలించాడు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో అంజయ్య తండ్రి, భార్య సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు.
రూ.3 లక్షలకు సుపారీ..
Karimnagar | అంజయ్యను నేరుగా చంపితే అనుమానం వస్తుందని భావించిన లచ్చయ్య అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో సుపారీ గ్యాంగ్ను సంప్రదించాడు. రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్లతో అంజయ్యను చంపేందుకు రూ.3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజయ్యతో స్నేహం పెంచుకున్న కోటేశ్వర్, అబ్రార్లు గత కొన్ని రోజులుగా అతనితో కలిసి మద్యం సేవించేవారు. పథకం ప్రకారం ఈ నెల 2వ తేదీన మద్యంసేవించడానికి ఊరి చివర ఉన్న కెనాల్ సమీపంలోకి అంజయ్యను తీసుకెళ్లారు. అక్కడ అంజయ్యకు మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. సాక్ష్యాలు లేకుండా ఎస్సారెస్పీ డీ–8 కాలువలో శవాన్ని పడేశారు. ఈనెల 5వ తేదీన శవం దొరకడంతో ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని భావించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లచ్చయ్య, శిరీషలపై అనుమానం రావడంతో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. లచ్చయ్య, శిరీషతో పాటు రవి, కోటేశ్వర్, అబ్రార్లను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: కేసీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ కౌంటర్
Follow Us On: Instagram


