కలం, వెబ్ డెస్క్: పోలీసులు తరుచుగా తనిఖీలు చేస్తున్నా ‘స్పా’లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడటం లేదు. శనివారం హైదరాబాద్ కూకట్పల్లిలోని (Kukatpally) ‘ఆసనా వెల్నెస్ స్పా’ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. స్పా పేరుతో ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు. దాడి సమయంలో స్పాలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 30 మంది యువకులు, 15 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో పట్టుబడిన యువతీ యువకులపాటు స్పా (Spa) నిర్వాహకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. వీరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నివాస ప్రాంతాల మధ్య స్పా ముసుగులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


