కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన ధరణి- భూభారతి కుంభకోణం (Bhu Bharati Scam) కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు రూ.63.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్ టాప్లు, ఐదు డెస్క్ టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండ యాదగిరిగుట్టలో ఆన్లైన్ సర్వీస్ సెంటర్లతో కలిసి పనిచేస్తూ, చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి తక్కువ మొత్తం చెల్లించి మిగిలిన డబ్బును దోచుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
నిందితులు మధ్యవర్తులకు 10 నుంచి 30 శాతం వరకు కమిషన్ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డారు. దీని ద్వారా దాదాపు రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు శుక్రవారం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పసునూరి బసవ రాజు(32), యాదాద్రి జిల్లాకు చెందిన జెల్లా పాండ(46), మహేశ్వరం గణేష్ కుమార్(39), గజులపాటి శ్రీనాథ్(35), జనగామకు చెందిన యెనగంధుల వెంకటేష్, కోదురి శ్రావణ్(35), కొలిపాక సతీష్ కుమార్(36), తడూరి రంజిత్ కుమార్(39), దుంపల కిషన్ రెడ్డి(29), యాదాద్రి జిల్లాకు చెదిన దశరథ మేఘావత్(28), నారా భాను ప్రసాద్(30), యాదగిరిగుట్టకు చెందిన గొపగాను శ్రీనాథ్(32), శివ కుమార్(33), నల్లగొండకు చెందిన అలేటి నాగరాజు(32), యాదాద్రి జిల్లాకు చెందిన ఒగ్గు కర్నాకర్(42), కమల్ల ఉన్నారు.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండ ఇరువురు యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకొని చెల్లించాల్సిన మొత్తాన్ని ఏన్.ఆర్.ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీ సేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించాడు. వసూలు చేసిన డబ్బు నుండి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులకు, మధ్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఈ చలాన్ ప్రధాన నిందితుడికి పంపిచేవాడు. ఇలా వచ్చిన చలాన్లను బసవరాజు ధరణీ, భూభారతీ వెబ్ సైట్ ఇన్స్స్పెక్ట్ ” ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చాలన్ రుసుం తగ్గించేవాడు. అనంతరం ఆ చలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు.
ఇదే క్రమంలో నిందితులు మొబైల్ ఆప్లికేషన్ను ఉపయోగించి నిందితులు ప్రభుత్వానికి చెల్లించిన రుసుముకు సంబంధించి వెబ్సైట్లో జారీ అయిన రసీదులను చెల్లించాల్సిన దాని కంటే తక్కువగా మార్పు చేసి అనంతరం మార్పు చేసిన రుసుమును మాత్రమే ప్రభుత్వానికి చెల్లించిన నకిలీ చలాన్లను స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయములో మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మోసాలకు పాల్పడేవారు. ఈ విధంగా ప్రధాన నిందితులు ఇద్దరు సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో మీ సేవ, ఆన్లైన్ సర్వీసులు, మధ్యవర్తుల వద్ద నమోదు కావాల్సిన ధరణీ, భూ భారతి రిజిస్ట్రేషన్ పత్రాలను ప్రధాన నిందితులు తమ వద్దనే వెబ్ సైట్లో నమోదు చేసేవారు. ఇందుగాను ప్రధాన నిందితులు మిగితా వారికి పది శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్ చెల్లించేవారు.
ఈ కేసుకు సంబంధించి జనగామ, యాద్రాద్రి జిల్లాల్లో 1,080 పత్రాలకు సంబంధించిన లావాదేవీల్లో నిందితులు మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఈ రెండు జిల్లాలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదు కాబడ్డాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.ఈ ముఠా పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారయణ రెడ్డి, రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఇతర ఎస్ఐలు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

