కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) నుంచి రూ. 13,527 కోట్ల టర్మ్ లోన్ మంజూరైంది. ఈ ఒప్పందంపై సోమవారం ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ మధ్య సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈవో మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్, భారత ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్వో ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ 100 శాతం యాజమాన్యం ఎల్ అండ్ టీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ మెట్రో వ్యవస్థ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వ్యూహాత్మక ప్రజా రవాణా ఆస్తిగా మారింది.
ఈ రూ. 13,527 కోట్ల రుణాన్ని పాత బకాయిలను తీర్చడానికి ఉపయోగించనున్నారు. ఇందులో నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, టర్మ్ లోన్లు ఉన్నాయి. దీని ద్వారా ఉన్నత వడ్డీ రుణాల స్థానంలో తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక రుణాన్ని సమకూర్చనున్నారు.
ఈ రుణం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక పద్ధతుల్లో చెల్లించనున్నారు. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, కమిట్మెంట్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు జరిమానాలు లేవు. ఇది ఆర్థికంగా మరింత సమర్థవంతమైన రీఫైనాన్సింగ్ సదుపాయంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వం నుండి అన్కండీషనల్ గ్యారంటీ, ఆర్బీఐ ఆధారిత డైరెక్ట్ డెబిట్ మెకానిజం వంటి బలమైన క్రెడిట్ భద్రతా వ్యవస్థలు ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 మొత్తం 69.2 కిలోమీటర్ల పరిధిలో 57 స్టేషన్లతో మూడు కారిడార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు దీనిని వినియోగిస్తున్నారు. ఈ రీఫైనాన్సింగ్తో మెట్రో ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు, భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కారిడార్లు, మెరుగైన కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అభివృద్ధికి ఇది దోహదపడనుంది.

