కలం, నిజామాబాద్ బ్యూరో: చారిత్రాత్మకమైన ఖిల్లా రామాలయంలో (Khilla Ramalayam) ఎత్తయిన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్టించడం చారిత్రాత్మకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అభిప్రాయపడ్డారు. ఇందూరు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర కూట రాజులు నిర్మించి, చత్రపతి శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు అభివృద్ధి చేసిన ఖిల్లా రామాలయంలో 101 అడుగుల ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని.. ధర్మ కార్యానికి హిందువులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. నగరవాసులందరికీ కనపడేలా ఎత్తైన ధ్వజాన్ని ప్రతిష్టించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గురుప్రసాద్, కార్యదర్శి మారయ్య గౌడ్, మాజీ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, కోశాధికారి వాసు, గంట లింగం, హిందూ సంస్థల ప్రతినిధులు నరేష్, ప్రవీణ్, సూరి, సంతోష్, సాయిరాం, సాయి, సందీప్, బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్ పీ, భజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

