కలం, వెబ్డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC)పై వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం మంగళగిరి (Mangalagiri)లోని విద్యా శాఖ కార్యాలయం వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. మెగా డీఎస్సీ నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయంటూ వారు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మెరుగైన ర్యాంక్ రావడం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని అధికారులను నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వారు నేలపై కూర్చొని నిరసన తెలపడంతో కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని వైసీపీ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సైతం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో విఫలం అయ్యిందని, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మెరిట్ జాబితాను బహిర్గతం చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, అభ్యర్థుల సందేహాలను క్లియర్ చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

