కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 16న అరెస్టయిన భగీరథ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మాల్కాజిగిరి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో అతన్ని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న బండి భగీరథ్ కు పోలీసులు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా బండి భగీరథ్ ను మొయినాబాద్లోని అరణ్య ఫాంహౌస్కి తీసుకెళ్లారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో పోలీసులు బండి భగీరథ్ నుంచి పలు వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

