కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇంధన కొరత నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్ లేదు.. డిజిల్ లేదు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు.. రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణమని తెలిపారు. మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతా అన్నట్లుందని విమర్శించారు. సరిపడా ఫ్యూయల్ అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం.. పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు పెట్టడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కష్టాలు తీరవని.. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం (AP fuel crisis)పై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలని షర్మిల హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలని.. ఇంధనం కొరతకు లోపం ఎక్కడుందో గుర్తించాలని పేర్కొన్నారు. డిమాండ్ కి తగ్గ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 24 గంటల డెడ్ లైన్ లా ప్రభుత్వం పని చేయాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

